YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ముఖ్య నేతలు ఒకరి తర్వాత మరొకరు పార్టీని వీడుతూ ఆపార్టీ అధినేతకు కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నారు. బుధవారం, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వైసీపీకి తన రాజీనామా ప్రకటించారు. ఇప్పుడు మరో కీలక నేత, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, వైసీపీకి వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నారు. ఆయన అనుచరులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

YSRCP Loses Key Leaders to Janasena

ఉదయభాను, శుక్రవారం తన రాజీనామా బహిరంగంగా ప్రకటించనున్నారని సమాచారం. ఈ మేరకు ఆయన నియోజకవర్గ సిబ్బందితో సమావేశం నిర్వహించనున్నారు. అంతేకాకుండా, ఉదయభాను జనసేనలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసేన కూడా ఈ విషయం పై గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 22న ఉదయభాను జనసేన కండువా కప్పుకోనున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. రెండు సార్లు ప్రభుత్వ విప్‌గా పనిచేసిన ఆయన, వైసీపీకి మరో భారీ దెబ్బలా మారబోతున్నారు.

Also Read: KTR: రైతులను ఉగ్రవాదులుగా చూస్తున్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కేటీఆర్‌ ప్రశ్న

ఇకపోతే, బుధవారం బాలినేని శ్రీనివాస రెడ్డి తన రాజీనామా ప్రకటనలో, పార్టీ లోపల కోటరీల రాజ్యం నడుస్తోందని, తనను విస్మరించడమే కాకుండా, వదిలిపెట్టేందుకు అనేక కారణాలున్నాయని చెప్పారు. గురువారం ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలవనున్నారని, భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు జరుపుతారని తెలిపారు.

ఈ పరిణామాలపై ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. బాలినేని జనసేనలో చేరతారా? లేదా వేరే ఎలాంటి కీలక ప్రకటన చేస్తారా? జగన్‌పై ఏవైనా ఆరోపణలు చేయనున్నారా? అన్న ఆసక్తి అందరిలోనూ పెరుగుతోంది.