AP Government Decision on Temple Rituals and Traditions

AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలయాల నిర్వహణలో అర్చకులకు స్వయంప్రతిపత్తి కల్పిస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేవాలయాల్లో నిత్యం జరిగే పూజలు, ప్రత్యేక పూజలు, ఉత్సవాలు మరియు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణలో దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నుంచి దేవాదాయ శాఖ కమిషనర్ వరకు ఎవరూ జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. పూజా విధానాలు మరియు ఆగమ శాస్త్రాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారం అర్చకుల కే ఉందని ప్రభుత్వం వెల్లడించింది.

AP Government Decision on Temple Rituals and Traditions

ఈ నిర్ణయం ఆలయాల పవిత్రత, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అధికారుల జోక్యం వల్ల ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా, సంప్రదాయాలకు భిన్నంగా కార్యక్రమాలు జరిగే అవకాశముందనేది ప్రభుత్వం భావన. ఇది ఆలయాల పవిత్రతను దెబ్బతీయగలదని, భక్తుల నమ్మకాలకు భంగం కలిగించవచ్చని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అర్చకులు ఆగమ శాస్త్ర నిపుణులుగా, సంప్రదాయాల పరిరక్షకులుగా వ్యవహరిస్తారని ప్రభుత్వానికి నమ్మకం ఉంది.

Also Read: Green Chickpeas: ఈ పచ్చి శనగలు తింటున్నారా.. అయితే.. జాగ్రత్త ?

ఏదైనా ఆధ్యాత్మిక అంశంలో, పూజా విధానంపై అర్చకుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే, ఆలయ పీఠాధిపతులను సంప్రదించి సరైన నిర్ణయం తీసుకోవాలని అధికారులు సూచించారు. అర్చకులకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడంతో పాటు, ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా వ్యవహరించేలా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఆలయాల నిర్మాణం, జీర్ణోద్ధరణ, ఆస్తుల నిర్వహణ, ఆదాయ వ్యయాల పర్యవేక్షణ వంటి అభివృద్ధి విషయాల్లో మాత్రమే అధికారులు జోక్యం చేసుకోవాలని ప్రభుత్వం వెల్లడించింది. వైదిక కార్యక్రమాల నిర్వహణలో ఏ విధమైన జోక్యం ఉండకూడదని స్పష్టంగా పేర్కొంది. ఈ నిర్ణయం ఆలయ అర్చకులను ఆనందానికి గురిచేసింది. అర్చకులు తమకు ఇచ్చిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటూ, ఆలయాల పవిత్రతను కాపాడుతూ భక్తులకు మెరుగైన సేవలు అందిస్తారని ప్రభుత్వం ఆశిస్తోంది.