Manchu Lakshmi: ఇండిగో ఎయిర్లైన్స్లో మంచు లక్ష్మికి చేదు అనుభవం.. దురుసుగా ప్రవర్తించిన సిబ్బంది!!
Manchu Lakshmi: ప్రముఖ నటి మంచు లక్ష్మి తాజాగా ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గోవా ప్రయాణం సందర్భంగా, లగేజ్ బ్యాగ్ను సరిగా చెక్ చేయకపోవడం, సిబ్బంది దురుసు ప్రవర్తన, పాస్పోర్ట్ లాంటి కీలక వస్తువుల విషయంలో నిర్లక్ష్యం వహించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “మా లగేజ్ను చూడటానికి అనుమతించకపోవడమే కాకుండా, వినకపోతే గోవాలోనే వదిలేస్తామని బెదిరించారు,” అని మంచు లక్ష్మి తన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
Manchu Lakshmi Criticizes Indigo Airlines Staff
ఇటువంటి దురుసు ప్రవర్తనను చూసినప్పుడు, ఇది ఒక రకమైన వేధింపుగా భావించవచ్చని ఆమె పేర్కొన్నారు. సెక్యూరిటీ ట్యాగ్ సరిగా లేకపోతే వస్తువులు పోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. తమ ప్రవర్తనలో మార్పు లేకుండా, సిబ్బంది ఇతర ప్రయాణికుల పట్ల కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారని మంచు లక్ష్మి వెల్లడించారు.
ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా తిరుపతి నుండి హైదరాబాద్ ప్రయాణించిన సమయంలో, తన పర్సు పోయిందని, కానీ సిబ్బంది ఎలాంటి సహాయం చేయలేదని ఆరోపించారు. ఆ సమయంలో ఆమె తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ, సిబ్బంది నిర్లక్ష్యం చూపారని గుర్తుచేసుకున్నారు. మంచు లక్ష్మి చేసిన ట్వీట్లు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇండిగో ఎయిర్లైన్స్ ప్రవర్తనపై నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ సమస్యకు సరైన పరిష్కారం కావాలని డిమాండ్ చేస్తున్నారు.