దెందులూరు నియోజకవర్గంలో సాగునీరు కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బాగా సాగునీరు అందిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి అల్లకల్లోలంగా మారిందని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఆరోపించారు. రైతులు పంటలు ఎండిపోతే వారికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆయన విమర్శలు గుప్పించారు.
Denduluru Irrigation crisis deepens
అబ్బయ్య చౌదరి శనివారం ఏలూరు జిల్లాలోని కొవ్వలి, దోసపాడు, పోతునూరు, మల్కాపురం గ్రామాల్లో పర్యటించారు. అక్కడ ఎండిపోయిన వరిచేలను చూసి రైతులతో మాట్లాడారు. కొవ్వలికి చెందిన పోలయ్య అనే కౌలు రైతు తొమ్మిది ఎకరాల్లో సాగు చేశాడు. కానీ నీరు లేక చేనంతా ఎండిపోయింది. అతనికి లక్ష రూపాయలకు పైగా నష్టం వచ్చింది. ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయని, రైతులు కళ్ల ముందు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై మండిపడ్డారు. ఆయన కేవలం మీటింగ్లకే పరిమితమయ్యారని, ‘రైతులకు నీరు ఇవ్వలేం’ అని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పోలవరం కుడి కాలువ నుంచి నీటిని డైవర్ట్ చేసి, కొప్పులవారి గూడెం లాకుల ద్వారా సాగునీరు అందించేదని గుర్తు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందని ఆరోపించారు.
చంద్రబాబు పాలన అంటే రైతులకు ఊరట లేదని, మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన ప్రభాకర్ యొక్క అనుభవం ఎక్కడికి పోయిందని అబ్బయ్య చౌదరి ప్రశ్నించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని హెచ్చరించిన ఆయన, ప్రభుత్వానికి 48 గంటల అల్టిమేటం ఇచ్చారు. ఆ సమయంలోగా దెందులూరు, ఏలూరు రూరల్ మండలాల్లోని ఎండిపోతున్న పొలాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే మరింత ఉదృతమైన ఉద్యమం తప్పదని హెచ్చరించారు.





