SBI: మనలో చాలా మందికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో అకౌంట్ ఉంటుంది. అయితే ఎస్బీఐ యూజర్లను హడలెత్తించే విధంగా ఓ న్యూస్ గత కొద్ది రోజుల నుంచి నెట్టింట సర్కులేట్ అవుతోంది. పాన్ కార్డు లింక్ చేయకపోతే ఎస్బీఐ ఆ అకౌంట్స్ ను క్లోజ్ చేస్తుంది అన్నదే ఆ వార్త సారాంశం. చాలా మంది ఫోన్కు ఈ తరహా మెసేజ్ కూడా వెళ్తున్నాయి. అసలు పాన్ కార్డు లింక్ చేయకపోతే అకౌంట్ క్లోజ్ చేయడమేంటి..? ఇందులో నిజమెంత..? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
SBI Users Beware from “Link Pan Card to Prevent Closure” is a New Cyber Fraud
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది. పాన్ కార్డు లింక్ చేయకపోతే బ్యాంక్ అకౌంట్ ను ఎస్బీఐ క్లోజ్ చేస్తుంది అన్న వార్తలో ఎలాంటి నిజం లేదు. ఇదంతా సైబర్ మోసగాళ్ల పని అని తెలుస్తోంది. పీఐబీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. గత కొద్ది రోజులుగా స్టేట్ బ్యాంక్ పేరును అడ్డుపెట్టుకుని సైబర్ మోసగాళ్లు మీ అకౌంట్ పాన్ నంబర్ను అప్డేట్ చేసుకోండి.. లేకపోతే ఖాతా బ్లాక్ చేయబడుతుందని మెసేజ్లు పంపుతున్నారు.
అలాగే కాల్ లేదా ఏదైనా లింక్ ద్వారా పాన్ సమాచారాన్ని అప్డేట్ చేయాలని సలహా ఇస్తున్నారు. బ్యాంక్ ఎవరికీ ఇటువంటి సలహాలు ఇవ్వదు. పాన్ వివరాలను అప్డేట్ చేయమని ఎస్బీఐ ఎలాంటి లింక్ను కస్టమర్లకు పంపదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా ఎస్బీఐ యూజర్లు గుర్తించాలి. ఒకవేళ ఎవరైనా సైబర్ కేటుగాళ వలలో చిక్కుకుంటే.. సైబర్ క్రైమ్ సెల్ నంబర్ 1930ను సంప్రదించాలి.
లేదా phishing@sbi.co ఇమెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు పంపవచ్చు అని పీఐబీ తన ట్వీట్ లో పేర్కొంది. ఇకపోతే బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు తప్పనిసరిగా ఆధార్, పాన్ కార్డ్ నంబర్లను లింక్ చేసుకోవడం చాలా అవసరం లేదు. అలా అని లింక్ చేయకపోతే అకౌంట్ను క్లోజ్ చేసేస్తారు అనుకుంటే పొరపాటు. కానీ, పాన్ కార్డు లింక్ చేయకపోవడం వల్ల బ్యాంకింగ్ సేవల్లో మాత్రం అంతరాయం కలుగుతుంది. (SBI)