సింగరేణి భవిష్యత్తుపై ఆందోళన: కొప్పుల ఈశ్వర్ స్పష్టీకరణ

టీబీజీకేఎస్ పోరాటం వల్లే తాడిచర్ల బ్లాక్ సింగరేణికి దక్కిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఈ విజయాన్ని కాంగ్రెస్, బీజేపీలు తమదిగా చెప్పుకోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. గురువారం తెలంగాణభవన్ లో టీబీజీకేఎస్ నాయకులతో కలిసి మాట్లాడుతూ, 1995లో తాడిచెర్లను సింగరేణే గుర్తించిందని, భవిష్యత్తులో ఏ గనినైనా సింగరేణికే కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

సింగరేణి నిర్వీర్యం అయ్యే పరిస్థితి వచ్చిందని కొప్పుల ఈశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు కారణం కేంద్రం తెచ్చిన ఎండీఆర్ యాక్ట్ అని ఆయన అన్నారు. నాడు వేలం ప్రక్రియ తెచ్చి సింగరేణికి బ్లాక్లు దక్కకుండా చేసిన పాపం మోదీ సర్కార్ దేనని విమర్శించారు. పార్లమెంటులో దీన్ని అడ్డుకోవాల్సిన కాంగ్రెస్ చేతులెత్తేసిందని కూడా ఆయన ధ్వజమెత్తారు. టీబీజీకేఎస్‌కు పెరుగుతున్న ఆదరణను చూసి రెండు పార్టీలూ కుట్రలకు దిగుతున్నాయని ఆరోపించారు.

టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఓపెన్ కాస్ట్ గనులను నామినేషన్ పద్ధతిలో సింగరేణికి కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ బ్లాక్ నిర్ణయానికి బీఆర్ఎస్ తప్ప అన్ని పార్టీలు మద్దతిచ్చాయని గుర్తుచేశారు. సింగరేణి సాంకేతికత, మానవవనరుల్లో ముందంజలో ఉందని, ఆ ఏరియాలోని అన్ని బ్లాక్లను సింగరేణికి కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపించాలని డిమాండ్ చేశారు.

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సింగరేణిలో జరుగుతున్న స్కామ్‌లపై మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డే ఈ స్కామ్‌లకు సూత్రధారి అని, ఆయన బావమరిది సృజన్ రెడ్డి పాత్రధారి అని ఆరోపించారు. గతంలో కేసీఆర్ 16 వేల మందికి కారుణ్య నియామకాలు చేశారని, కానీ కాంగ్రెస్ రెండున్నరేండ్లలో 330 మందికే ఉద్యోగాలిచ్చిందని విమర్శించారు. సింగరేణిలో స్కామ్‌లపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

Share your love