సీఎం చంద్రబాబు నాయుడు తన మంత్రి నారా లోకేష్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఏకబిగిన ఏడున్నర గంటల పాటు ప్రజల సమస్యలు విని, వాటిని పరిష్కరించడం లోకేష్ కు సహజసిద్ధమైన గుణం అని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన విధానం నిజంగా అభినందనీయం అని అన్నారు. యువ నాయకులు ఇలా కష్టపడితే, ప్రభుత్వానికి ప్రత్యేకంగా ప్రచారం అక్కర్లేదు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Lokesh Patience Babu Praises
ఇంటి పట్టాల పంపిణీని స్వయంగా చేపట్టడం వల్ల పేదలతో ప్రత్యక్ష సంబంధం ఏర్పడుతుందని, అది వారి నమ్మకాన్ని పెంచుతుందని సీఎం చెప్పారు. అధికారులపై మాత్రమే బాధ్యతలు వదిలేయడం సరికాదని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇదే మార్గంలో పేదలకు స్వయంగా పట్టాలు అందజేయాలని దిశానిర్దేశం చేశారు. తాజా మంత్రివర్గ సమావేశంలో కూడా ఈ అంశాలను వివరించి, ప్రతి మంత్రి చొరవ చూపించాలని సూచించారు.
గొడ్డలి పార్టీ అంటే వైసీపీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం హెచ్చరికలు జారీ చేశారు. లేనిపోని వివాదాలు సృష్టించి, వాటిని కూటమి ప్రభుత్వంపై విసిరే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. వీటిని గుర్తించి, వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని సూచించారు. డీఎస్సీ-నీట్ లింక్ విషయంలో కూడా ఇదే తరహా ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని నిర్భయంగా ఎదుర్కోవాలని చెప్పారు.
ఇక క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించే విషయంలో మంత్రులు ఇంకా వెనుకబడి ఉన్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు తెలిపారు. మంత్రులకు, కలెక్టర్లకు మధ్య సమన్వయం ఉండాలని, కలిసి పనిచేస్తేనే ప్రజలకు మంచి ఫలితాలు అందుతాయని చెప్పారు. వివాదాలు రేపే వారిని ఉపేక్షించరాదని, బలంగా తిప్పికొట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.





