వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కర్నూలు జిల్లాలో కీలక పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖత్ ద్వారా పరామర్శించనున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా జగన్ కలుసుకుని వారికి ధైర్యం చెప్పి, పూర్తి భరోసా కల్పించనున్నారని తెలుస్తోంది.
ఈ పర్యటన నేపథ్యంలో కర్నూలు జిల్లా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. జగన్ ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి, 9.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం ప్రత్యేక విమానంలో కర్నూలు చేరుకుని జైలుకు వెళ్లనున్నారు. పోలీసులు నిర్దేశించిన షరతులకు అనుగుణంగానే ఈ పర్యటన జరుగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు హీటెక్కుతున్న తరుణంలో జగన్ ఈ పర్యటన జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తమ నేతపై అధికార యంత్రాంగం అన్యాయంగా వ్యవహరిస్తోందన్న వైసీపీ ఆరోపణల నేపథ్యంలో, జగన్ నేరుగా జైలుకు వెళ్లి విరూపాక్షిని కలవడం రాజకీయంగా హైలైట్ అవుతోంది. పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు, నేతలకు అండగా ఉంటామని చాటేందుకు జగన్ ఈ పర్యటనను వినియోగించుకునే అవకాశం ఉంది.
జగన్ రాకతో కర్నూలు జిల్లాలో రాజకీయ వేడి పెరిగింది. పార్టీ శ్రేణులు ఆయనను స్వాగతించేందుకు సన్నాహాలు చేస్తుండగా, పోలీసులు మాత్రం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జైలు పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు. జగన్ పర్యటన షెడ్యూల్ ప్రకారం సాఫీగా సాగుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది.





