భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు రేపు అంటే జూలై 17న పట్టాలెక్కనుంది. ప్రధాని మోదీ ఈ రైలును ప్రారంభించనున్నారు. స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన ఈ రైలు హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో నడవనుంది. పర్యావరణ స్నేహపూర్వక రవాణా దిశగా ఇదొక పెద్ద ముందడుగు అని చెప్పొచ్చు.
first hydrogen train in India starts
జింద్ నుంచి సోనిపట్ మధ్య దూరం 89 కిలోమీటర్లు. ఈ రైలులో మొత్తం 10 కోచ్లు ఉంటాయి. గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో దీన్ని డిజైన్ చేశారు. ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ ఆధారంగా ఈ రైలు నడుస్తుంది. 1200 కిలోవాట్ల ప్రొపల్షన్ సిస్టమ్ ఇందులో ఉంటుంది. ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాతే ఈ రైలును ప్రారంభిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ఈ రైలు రోజూ ఉదయం 7:40 గంటలకు జింద్ స్టేషన్ నుంచి బయలుదేరి 9:40కి సోనిపట్ చేరుకుంటుంది. ఇందులో సుమారు 2,600 మంది ప్రయాణించవచ్చు. టికెట్ ధరలు కూడా చాలా అందుబాటులో ఉన్నాయి. రూ.5 నుంచి రూ.25 వరకు మాత్రమే టికెట్ ఖర్చు. జింద్లోనే ప్రత్యేకమైన హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే రైలుకు ఇంధనం సరఫరా అవుతుంది.
ఈ ప్రాజెక్టు విజయవంతమైతే దేశంలో మరో 35 హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ ప్రణాళికలు వేస్తోంది. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ స్థానిక పాఠశాల విద్యార్థులతో కలిసి కొంత దూరం ప్రయాణించే అవకాశం ఉంది. పర్యావరణాన్ని కాపాడుతూ ప్యాసింజర్లకు సౌకర్యాన్నిచ్చే ఈ హైడ్రోజన్ రైలు, రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయాన్ని తెరవనుంది.





