కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. వర్షాలు సరిగ్గా లేక రైతులు నీటి కోసం అల్లాడుతుండగా, ప్రభుత్వం మాత్రం నిదానంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలతో ఈ పిటిషన్ వేశారు. మరమ్మతుల విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ సీరియస్గా లేదని పిటిషనర్ వాదిస్తున్నారు.
Kaleshwaram Project పై కోర్టు విచారణ
న్యాయవాది శరత్ అనే ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్లో కుంగిన బ్యారేజీలకు మరమ్మతుల విషయాన్ని సవాల్ చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల మరమ్మతుల్లో ప్రభుత్వం చూపిస్తున్న అలసత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ అనుమతి ఇచ్చినా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. రాజకీయ కారణాలతోనే ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని ఆరోపించారు.
న్యాయవాది శరత్ తన పిటిషన్లో ఎన్డీఎస్ నిపుణుల బృందాన్ని మరోసారి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిశీలనకు పంపాలని కోరారు. ఇప్పటికే ఎన్డీఎస్ నివేదికను సమర్పించినా, ఆ నివేదిక ఆధారంగా మరమ్మతులు జరగలేదని ఆయన వాదించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపిస్తుండటంతో విచారణను జూలై 20వ తేదీ సోమవారానికి వాయిదా వేశారు. ఈ కేసులో ఇప్పటికీ ప్రభుత్వం నుంచి క్లియర్ కట్ రెస్పాన్స్ రాలేదని, రైతులు ఆందోళనలో ఉన్నారని పిటిషనర్ వాదించారు.





