కాజల్ అగర్వాల్: కొడుకు కోసం వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు

తల్లిగా మారిన తర్వాత కెరీర్లో కొత్త ప్రమాణాలు నిర్దేశించుకుంటున్న స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. దశాబ్దానికి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అగ్ర కథానాయికగా రాణించిన కాజల్, తల్లి అయిన తర్వాత తన ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయినట్లు తెలిపారు. ఇప్పుడు సినిమాల ఎంపికలో తనకు ప్రాధాన్యత ఇచ్చే విధానంలో పెద్ద మార్పు వచ్చిందని చెప్పారు.

తన కొడుకు నీల్ పెద్దయ్యాక చూసేందుకు గర్వించదగ్గ సినిమాలు మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నట్లు కాజల్ అగర్వాల్ వెల్లడించారు. ఏ కథ విన్నా ముందు తల్లిగా ఆలోచిస్తానని, స్క్రిప్ట్ ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నానని తెలిపారు. కమర్షియల్ లక్ష్యాలు కాకుండా, మంచి కథ, బలమైన పాత్ర, సమాజానికి ఉపయోగపడే సందేశం ఉన్న చిత్రాలకు మాత్రమే ఓకే చెబుతున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘రామాయణ’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో కాజల్ మండోదరి పాత్ర పోషిస్తున్నారు. తన కుమారుడు నీల్‌కు రామాయణంపై ఉన్న ఆసక్తి గురించి చెప్తూ, శ్రీరాముడి కంటే రావణుడి పాత్రే ఎక్కువ ఇష్టమని కాజల్ నవ్వుతూ చెప్పారు.

చేతన్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది ఇండియా స్టోరీ’లో కాజల్ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. కల్తీ ఆహారం, వ్యవసాయంలో అధికంగా వాడుతున్న పురుగుమందుల వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావాన్ని చర్చించే ఈ కథ విన్న తర్వాత ఒక తల్లిగా చాలా ఆలోచించానని చెప్పారు. ఇండియా స్టోరీ షూటింగ్ అనంతరం తన ఇంటి జీవనశైలిలో కూడా మార్పులు చేసుకున్నట్లు కాజల్ తెలిపారు. జూలై 24న విడుదలవుతున్న ఈ చిత్రంలో శ్రేయస్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Share your love