Polavaram Pledge: పోలవరం ప్రాజెక్టు ఆరు నెలల్లో పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం

పోలవరం ప్రాజెక్టును ఆరు నెలల్లో పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. రాజమండ్రిలోని ధవళేశ్వరం ప్రాజెక్టులో కొత్త గేట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన ఆయన, పోలవరం ప్రాజెక్టు పూర్తికి కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాల నాటికి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం ఇస్తామని తెలిపారు.

Polavaram Pledge: CM’s big promise

గత టీడీపీ ప్రభుత్వంలో 32 గేట్లు మార్చగా, ఇప్పుడు మిగిలిన 64 తుప్పుపట్టిన గేట్లను రీప్లేస్ చేస్తున్నామన్నారు. వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడంతో పాటు, అన్నమయ్య ప్రాజెక్టు కూడా దెబ్బతిన్నా వారు పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు తాము ఆ బాధ్యత తీసుకున్నామని, వచ్చే జూన్ నాటికి తొలిదశ పూర్తి చేస్తామని చెప్పారు.

ప్రాజెక్టులే రాష్ట్రానికి ఆర్థిక వనరులని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. కూటమి ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ మంచి మిత్రుడని చెప్పిన ఆయన, ఆయన కుడిభుజానికి ఆపరేషన్ అయిందని, తాను ముంబై వెళ్లి పరామర్శించినట్టు తెలిపారు. పూర్తిగా కోలుకున్నాకే విధుల్లోకి రావాలని సూచించినట్టు వెల్లడించారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తితో పాటు, గోదావరి పుష్కరాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తామని సీఎం తెలిపారు. వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందని, అన్ని స్థానాల్లో గెలిచినా ఆశ్చర్యం లేదని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం ఇవ్వడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

Share your love