ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది దసరా తర్వాత ముందుగా మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత దశలవారీగా ఇతర స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికల సమరానికి అధికార కూటమి, వైసీపీ రెండూ సిద్ధమవుతున్నాయి. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో కలిసి ఈ అంశం మీద చర్చించి కేడర్ ను అలర్ట్ చేశారు.
Local Elections Battle in AP
కూటమి సమన్వయ కమిటీ ఈ నెల 15న భేటీ అవుతుంది. ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహం, సీట్ల పంపకం గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. మూడు పార్టీల నుంచి ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు చేయాలని నేతలు ఆలోచిస్తున్నారు. ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తన పార్టీ నేతలకు స్థానిక ఎన్నికలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎంత ఒత్తిడి వచ్చినా ప్రతి స్థానంలో పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలని, లేకపోతే ఇన్ఛార్జ్ ను బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పైన సానుకూలత పెరుగుతోందని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు. అటు వైసీపీ మాత్రం ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉందని, 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నామని చెబుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో స్థానిక ఎన్నికలు ప్రధాన పార్టీల మధ్య పరీక్షా వేదికగా మారనున్నాయి.
ఈ నెల 15న కూటమి సమన్వయ కమిటీ సమావేశం, 16న జగన్ పార్టీ నేతలతో భేటీ జరిగే అవకాశం ఉంది. ఈ రెండు సమావేశాల్లో స్థానిక ఎన్నికల బరి, అభ్యర్థుల ఎంపిక వంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ వేడి పెరుగుతోంది. ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు తమ వ్యూహాలను ఖరారు చేసుకుంటున్నాయి.





