హైడ్రా తన చర్యలతో మరోసారి దుమ్ము లేపింది. హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మిస్తున్న ప్రాజెక్టుకు సంబంధించి జనవాడ ఫామ్హౌస్ యజమానికి షాకిచ్చింది. సోమాజిగూడలోని రాజ్ భవన్ రోడ్డులో ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనంలో ఫ్లాట్లు కొనకూడదని సంభావ్య కొనుగోలుదారులను హైడ్రా హెచ్చరించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్టీఎల్) మరియు బఫర్ జోన్లో వస్తుందని అధికారిక తనిఖీల్లో వెల్లడైంది.
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ఈ ప్రాజెక్టుకు సంబంధం ఉందనే ప్రచారం నేపథ్యంలో హైడ్రా చర్యకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. అయితే, హైడ్రా తన అడ్వైజరీలో ఎలాంటి రాజకీయ వ్యక్తుల ప్రస్తావన చేయలేదు. ఈ ప్రాజెక్ట్ నియంత్రణ ఉల్లంఘనలపై మాత్రమే దృష్టి సారించింది. GHMC నుంచి ఈ ప్రాజెక్టుకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీకి వ్యతిరేకంగా ఫిర్యాదు అందినట్లు హైడ్రా తెలిపింది. ఈ ప్రాజెక్ట్లో రెండు రెసిడెన్షియల్ టవర్లు, రెండు సెల్లార్లు, స్టిల్ట్ ఫ్లోర్, 17 ఫ్లోర్లు, క్లబ్హౌస్ ఉన్నాయి.
నీటిపారుదల శాఖ మరియు జిల్లా అధికారుల సంయుక్త తనిఖీల్లో 7,640.89 చదరపు మీటర్ల స్థలంలో 7,355.15 చదరపు మీటర్లు హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో, మిగిలిన 285.74 చదరపు మీటర్లు 30 మీటర్ల బఫర్ జోన్లో ఉన్నట్లు నిర్ధారించారు. టౌన్ సర్వే ల్యాండ్ రిజిస్టర్లో ఈ భూమి ట్యాంక్ సబ్మెర్జ్డ్ ఖాళీ భూమిగా నమోదై ఉంది. ఈ ఆస్తికి ఎలాంటి NOC జారీ చేయలేదని హైదరాబాద్ కలెక్టర్ GHMCకు తెలిపారు. ఈ భూమికి సంబంధించి సిటీ సివిల్ కోర్టు మరియు హైకోర్టులో పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో GHMC 2018, 2020లో మంజూరు చేసిన బిల్డింగ్ పర్మిషన్లను రద్దు చేసేందుకు షో-కాజ్ నోటీసు జారీ చేసింది. హైడ్రా ప్రజలకు టీజీ-బీపాస్ పోర్టల్ లేదా టౌన్ ప్లానింగ్ ఆఫీసు ద్వారా బిల్డింగ్ పర్మిషన్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ స్థితిని ధృవీకరించాలని సూచించింది. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా భవనాన్ని ఆక్రమించడం GHMC చట్టం ప్రకారం అనుమతించబడదని హెచ్చరించింది. హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్ల రక్షణకు GHMC, రెవెన్యూ, నీటిపారుదల శాఖలతో సమన్వయం కొనసాగిస్తామని హైడ్రా తెలిపింది.





