సుగాలి ప్రీతి హత్య కేసులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై చీటింగ్, నమ్మక ద్రోహం, కులాల మధ్య చిచ్చు పెట్టడం వంటి ఆరోపణలు చేస్తూ, తక్షణమే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని ఆవిడ హెచ్చరించడం గమనార్హం.
సుగాలి ప్రీతి తల్లి సోమవారం గన్నవరం పోలీస్ స్టేషన్కు వచ్చి, లిఖితపూర్వక ఫిర్యాదు అందించారు. 2017-18 మధ్య ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సుగాలి ప్రీతి దారుణంగా హత్యకు గురైంది. ఆ సమయంలో ఆమె చదువుతున్నారు. ఈ ఘటన 2019, 2024 ఎన్నికల్లో పెద్ద రాజకీయ దుమారం సృష్టించింది.
పార్వతీదేవి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ అప్పట్లో తన ఇంటికి వచ్చి పరామర్శించారని, అధికారంలోకి వచ్చాక తొలి సంతకం సుగాలి ప్రీతి కేసుపైనే పెడతానని హామీ ఇచ్చారని అన్నారు. కానీ, ప్రభుత్వంలో రెండేళ్లు అయినా న్యాయం జరగలేదని, తమ కుటుంబానికి ఎలాంటి భరోసా రాలేదని ఆమె విమర్శించారు. పైగా ఓ పార్టీ నాయకులు తనపై వేధింపులకు పాల్పడుతున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసులు స్పందించకపోతే హైకోర్టుకు వెళ్లాలనేది పార్వతీదేవి వైఖరి. సుగాలి ప్రీతి తల్లి పవన్ కళ్యాణ్ విషయంలో చీటింగ్, నమ్మక ద్రోహం వంటి సీరియస్ ఛార్జీలు మోపడంతో, ఈ కేసు రాజకీయంగా మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.





